వివిఐటి బాలోత్సవ్
పిల్లల అభ్యున్నతి మూడు అంశాల పైన ఆధారపడుతుంది. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలు. ఈ మూడింటి నుంచి సమపాళ్ళలో అందుకోలేని పిల్లలు ఆ మేరకు అసమగ్రంగా మిగిలిపోతారు. దురదృష్టవశాత్తూ విద్యావిధానంలో ఏర్పడిన మూసతత్వం వల్ల, ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయి కావడం వల్ల మనం జ్ఞాపకశక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతోంది. సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోగలిగింది కూడా వెనకబడిపోతోంది. వేగంగా నగరీకరణ చెందడం, ప్రకృతితో సంబంధం తెగిపోవడం, సమిష్ఠి తత్వానికి దూరం కావడం ఇవన్నీ ముందుతరాలకు నష్టం కలిగించే అంశాలు.
జీవనశైలులు మారుతున్న నేపధ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశించడంతోనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాల్సి రావడం నేటి విద్యాసంస్థల బాధ్యతగా పరిణమించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్ధినీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తి తత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
ఆరోగ్యకరమైన సమిష్ఠి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహపూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పధం మెరుగుపడడాన్ని గమనించారు.
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.
No comments:
Post a Comment